Thursday, July 7, 2016

సిరి సంపదలు

102                                                సిరి సంపదలు 

జీవితం స్థిరంగా ఉండేది కాదని, హెచ్చుతగ్గులు ఒడుదొడుకులు తప్పవని తెలిసినా మనిషి భావోద్వేగాలకు లోనవుతుంటాడు. ఎప్పుడూ ఏవో కొత్త అనుభవాలను మనిషికి జతచేస్తూ కాలం కదిలిపోతుంటుంది. ‘ఒకరు అదే నదికి రెండోసారి వెళ్లలేరు’ అంటారు ఒక గ్రీకు తత్వవేత్త. అంటే అంతర్గతంగా ఎంతో వేగంగా మారిపోతుంటుంది, స్థిరత్వం ఉండదని చెప్పడం! అలాగే అనుభవ సంపదా మారుతుంటుంది.
మనిషికి తెలియకుండానే నిన్నటి జ్ఞాపకాలు, రేపటి కలలు సంపదలుగా తోడుంటాయి. మనిషి గతానికి, భవిష్యత్తుకు అలవాటుగా అతుక్కుపోతుంటాడు. కాలానుగుణంగా ఎదురయ్యే అనుభవాలను సొంతం చేసుకుంటాడు. అవే సంపదలవుతాయి.
ఒక వ్యక్తి నిన్న తోటలోని బంగళాలో, ఈరోజు కార్యాలయంలో, రేపు పనిమీద తన వాహనంలోనో మరెక్కడో ఉన్నాడనుకుందాం. ఆ బంగళా, కార్యాలయం, వాహనం... అన్నింటినీ అతడు తనకు చెందిన సంపదలుగా భావిస్తాడు. వర్తమానంలో అవగాహనతో చూసినప్పుడు అది అంతా ఒక భ్రాంతి... మిథ్య! అవి అతడి సొంతమని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. భూత, భవిష్యత్‌, వర్తమానాల తాలూకు అనుభవాలు రకరకాలుగా వచ్చి చేరుతుంటాయి. అవి అతడి సంపదలుగా మారుతుంటాయి.
మనిషికి ఉండే సంపదలు అతణ్ని తృప్తిపరచలేకపోయినా, సంతోషంగా ఉండటానికి సహాయపడకపోయినా... అవి ఎంత గొప్పవైనా- వాటికి విలువ లేనట్లే. ఎన్నో వసతులున్న పడక గదిలో- అతడికి మనస్తాపం కలిగించే ఆలోచననో, అనారోగ్య కారణంగా ఇబ్బందినో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ గదిలోని సౌకర్యాలను అనుభూతి చెందడం సాధ్యం కాదు. సంపదలోని సౌఖ్యాన్ని అనుభవించాలంటే, వర్తమానంలో మనిషి మనసు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం.
నిత్యజీవితంలో మనిషి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ పని చేయడం యాంత్రికంగా మారుతుంది. ఆహారం తీసుకోవడం, ముస్తాబు కావడం, ప్రయాణం... అన్నీ ఒకదాని తరవాత మరొకటి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలా పట్టనట్లుగా సాగిపోయే పరిస్థితుల్లో అతడు ఉపయోగించే ఖరీదైన సాధనాలకు ప్రత్యేకంగా విలువ ఉండదు. కొంతకాలానికి అనుభూతిరహితంగా మారతాయి. అటువంటప్పుడు అవి ‘ఉన్నా లేకున్నా ఒక్కటే’ అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. అవి అందుబాటులో లేనప్పుడే, మళ్లీ కష్టం తెలుస్తుంది. అలవాటుపడిపోయిన ఆలోచనా విధానాన్ని ప్రశ్నించని పక్షంలో, ప్రపంచాన్ని మరో కోణంలో చూసే అవకాశం ఉండదు. విభిన్న సమయాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో వాటి అసలు విలువ గుర్తించి మసలుకోవడమే మంచి లక్షణం.
సక్రమమైన అవగాహన జీవితంలో ప్రాధాన్యాల విషయంలో ఆలోచనకు ఆస్కారం కల్పిస్తుంది. ఏది అవసరం, ఎప్పుడు అవసరం... లాంటి ప్రశ్నలు వేసుకుంటే, కావాల్సిన సంపదను మాత్రమే కలిగి ఉండేలా చేస్తుంది. అప్పుడు జీవితం తృప్తిగా సాగిపోతుంది.
ఓ వ్యక్తి ఒకసారి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, అది నిజంగా అతడిది కాదు. తరవాత అతడు తిరిగివచ్చి విశ్రాంతి తీసుకునేవరకు ఆ భావన మనసులో ఉంటుంది. మనసులో ఉన్న ప్రతిదీ అతడిది కావాలనీ లేదు. అటువంటప్పుడు, ప్రతి కలా వూహా అందరి సొంతమవుతాయి. ఆర్థిక స్తోమత లేనివారెందరో ఆ కలలు, వూహల్లో విహరిస్తుంటారు. వారికి అనుభూతితోనే జీవితం గడచిపోతుంది.
ఏ విధంగా ఆలోచించినా, జీవితంలో మనిషి అనుభవించేది సంపాదించుకున్నదాంట్లో కొద్ది భాగమే! అతడు సంతోషంగా ఉండేది మధుర జ్ఞాపకాల తాలూకు సంపదల వల్లనే!
సంపద అంతా వర్తమానంలోని నమూనా. అదే జీవితం. మనిషి ఆ సంపదను అనుభవించినప్పుడు, నమూనాగా మిగిలిపోతుంది. అనుభవించడానికి అక్కరకు రాని సంపద ఎంత ఉన్నా, వృథా కింద లెక్క! వర్తమానంలో కూడబెట్టడం ఒకెత్తు. కూడబెట్టినది అనుభవించడం మరొకెత్తు. అనుభవించగలగడం ఒక అదృష్టం!
- మంత్రవాది మహేశ్వర్‌
MIDI KEYBOARD

Sunday, July 3, 2016

98 వర్తమానం

వర్తమానం 
నిన్న జరిగిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేడు నిజం, ఈ గంట నిజం. ఈ క్షణం నిజం. ఇది వర్తమానం. మరుక్షణమే అది గతమైపోతోంది... భవిష్యత్తు వూహల్లో వూరిస్తూ ఉంటోంది. ఎందరో తాత్వికులు ‘వర్తమానంలో జీవించు’ అని బోధిస్తుంటారు. వర్తమానం నిశ్చల ఛాయాచిత్రంలా ఉండదు. కదిలిపోతుంటుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వర్తమానం గురించి మాట్లాడుకునేలోపే అది గతమై జ్ఞాపకంలో నిలుస్తుంది.
ఒక గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నప్పుడు సన్నటి వర్షపు తుంపర గడ్డిపూల మీద పడుతోంది... తుమ్మెదలు ఎగురుతున్నాయి. దృశ్యం తరవాత దృశ్యం కదలిపోతోంది... అది వర్తమానమా గతమా... ఇలా మారిపోతున్న దృశ్యాలు కోకొల్లలు... నేడు, నిన్న, రేపు... పుట్టుక, మరణం, పుట్టుక...
సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ తిరుగుడు విశ్వమంతా ఉంది. విశ్వం లోలోపల తిరుగుతూనే ఉంది. తిరక్కుండా ఏదీ లేదు. ఎంతో కొంత పౌనఃపున్యంతో అందరి శరీరాలు లోలోపల తిరుగుతూనే ఉన్నాయి. ఆ భ్రమణం కళ్లకు కనిపించదు. కానీ, భౌతికంగా మనం తిరుగుతున్నప్పుడే ఆ చలనం మనకు అనుభవమవుతుంది. మనం తిరక్కుండా ఒక దగ్గర కూర్చున్నప్పుడు కూడా మన లోపల సర్వమూ తిరుగుతూనే ఉంది. ఈ తిరుగుడు విశ్వానికి అనుసంధానమై ఉంది. దీనికి భక్తిని జోడిస్తే అది ప్రదక్షిణంగా మారుతుంది. ఈ ప్రదక్షిణాలు సవ్య, అపసవ్య దిశల్లో జగత్తంతా నిండి ఉన్నాయి. మన శరీరాన్ని ఆవరించి ఉన్న సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాల మీద జీవుడు నిరంతరం ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు అంటోంది యోగశాస్త్రం. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. జనన-మరణాలు ఒక వలయంగా ఏర్పడి జీవులను తిప్పుతూనే ఉంటాయి.
మరి వర్తమానం మాటేమిటి?దాన్ని పట్టుకోవాలనే ఉబలాటంలోనే ధ్యానం సాగుతుంది. ధ్యానం వర్తమానం. అది నిత్యనూతనం. కళ్లు మూసుకొని కాలాతీతమై పోవాలి. అప్పుడు మూడు కాలాలు ఒక్కటై పోతాయి. ఆనందసాగరంలో ఓలలాడతాం. కళ్లు తెరచి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వాళ్లతో వైరుధ్యాలకు అతీతంగా కలిసిపోవాలి. కలుపుగోలుగా ఆ క్షణాలను పండించుకొని బంధాలు కలుపుకొని ముందుకు సాగాలి. అదే ఆనంద వ్యవసాయం. చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తిని, ఆనందాన్ని పొందాలి. ఇలా వర్తమానం సాగాలి. రేపటికి మంచి స్మృతిని పదిలపరచుకోవాలి.
దివ్యత్వం ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మాట్లాడుతోంది. మన మనసు పరధ్యానంలో పడిపోయి అవకాశాలను వదులుకుంటోంది. అటు జరిగిన దానిలోనో, ఇటు జరగబోయే దానిలోనో మనసు వూయలలూగి వర్తమాన క్షణాలను చెయ్యి జార్చుకుంటోంది. వేరే మాటల్లో కాలం కరిగిపోతోంది.
రాముడి గురించి చదువుతున్నప్పుడు మనసంతా ఆయనే నిండిపోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో మునిగిపోవాలి. తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు, దువ్వెన తప్ప తలలో రెండో ఆలోచన ఉండకూడదు. కాలం, ప్రకృతి, దివ్యత్వం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటాయి. సరికొత్తగా ముస్తాబవుతుంటాయి. వర్తమానంలో ఉంటాయి. కలవాలనే ఇచ్ఛ మనకు ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మనం వాటిలో లీనమవగలం. ఈ రహస్యం తెలిసినవాడు సంతోషాన్ని నెమలి పింఛంగా ధరించి శ్రీకృష్ణుడిలా నిత్య వర్తమానంలో విహరిస్తాడు.
కాలం నుంచి తప్పించుకుపోయినప్పుడు ఎంతో ఆనంద పారవశ్యం కలుగుతుంది. మనసులో బొమ్మలన్నీ మాయమైపోతాయి. అవి ఉంటే కాలం ఉంటుంది. అవి అంతరించిపోయినప్పుడే కాలం కూడా అంతరించిపోతుంది. నిర్మల ‘వర్తమానం’ మాత్రం మిగులుతుంది. వర్తమానం అన్నది కాలంలో ఓ భాగంగా భాషలో మాత్రమే ఉంటుంది. వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతంగా ఉంటుంది. ఆ వర్తమానంలో ఉండటమే ఆత్మస్థితిలో ఉండటం అంటారు ఓషో.