Thursday, June 30, 2016

97 శుద్ధ జలం

97                                                                          శుద్ధ జలం

ల్లాహ్‌ సృష్టిలోని అణువణువూ మానవులకు ఉపకరించేదే. భూమ్యాకాశాలు, లోయలు, పర్వత సానువులు, నదులు, సముద్రాలు, ఫలపుష్పాదులు, సజీవ నిర్జీవాలు...అన్నీ అత్యుత్తమ మనుగడ కోసమే. శుద్ధజలం మానవజాతి స్వచ్ఛతకు, ప్రాణరక్షణకు అత్యంత అవసరమైనది.‘నీరు పరిశుభ్రమైనది...ఏ వస్తువూ దాన్ని అపరిశుభ్రం చేయజాలదు.రెండు తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మాలిన్యం పడినంత మాత్రాన అపరిశుద్ధం అయిపోదు...ఒకవేళ ఆ నీటి రంగు, రుచి, వాసన మారిపోతే తప్ప’ అని మహా ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ) అన్నారు.
‘మేము ఆకాశం నుంచి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేశాము’ (ఖురాన్‌ 25:48) అని అల్లాహ్‌ తెలిపారు. ఇస్లాం ధర్మ నియమావళి ప్రకారం, ప్రతి నమాజుకు ముందు ఉజూ చేయాలి. ఉజూ కోసం నీరు కావాలి. ఉజూ చేసేటప్పుడు అవసరానికి మించి నీరు వాడరాదు. శరీర అవయవాలు అన్నింటినీ నీటితో కడిగేందుకు వీలులేనప్పుడు తడి చేత్తో తుడిచేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.
మానవ జీవితంతో మమేకమైన నీటి వాడక ప్రాశస్త్యాన్ని పవిత్ర ఖురాన్‌ గ్రంథం తెలియజెబుతోంది. వర్షం కోసం చేసే ప్రత్యేక నమాజు ఇస్తిస్ఖా నమాజు. పండుగ నమాజులాగా దీన్ని సామూహికంగా ఈద్గాహ్‌లో ‘రెండు రకాతులు’ చేయాలి. ‘యా అల్లాహ్‌... దాహాన్ని తీర్చేది,ప్రయోజనకరమైనది, ఆలస్యం కాకుండాధరిత్రికిధారాపాతంగా చేరేదీ అయిన వర్షం కురిపించి దాహార్తిని తీర్చు. నీ దాసులకు, నోరులేని నీ జంతువులకు నీళ్ళు తాగించు. నీ కారుణ్య వర్షాన్ని అందరిపై కురిపించు’ అని అల్లాహ్‌ను ప్రార్థిస్తారు.
మహా ప్రవక్త ప్రబోధించిన విధంగా అల్లాహ్‌ మూడు రకాల మనుషుల్ని కరుణించడు. మొదటివారు తమ వర్తకపు సరకు గురించి అసత్య ప్రమాణం చేసేవారు, రెండోవారు తోటి మానవుల ధనంపై ఆశ కలిగినవారు. మూడోవారు ‘తమ అవసరానికి మించి నీటిని నిలుపుకొనేవారు’. దైవ సందేశహరులు (స.అ.వ) సహచరుల్ని ఉద్దేశించి ఇలా ప్రబోధించారు. ‘ప్రళయదినాన నేను కౌసర్‌ కోనేటి వద్దకు మీకంటే ముందే చేరి, మీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతాను. మీ దాహం తీర్చే ఏర్పాటుచేస్తాను. నా వద్దకు చేరగలిగిన ప్రతి వ్యక్తీ ఆ కోనేటి నీరు తాగుతాడు. మరెప్పుడూ అతడికి దాహం వేయదు. ధార్మిక విషయాల్లో ధర్మవిరుద్ధ విషయాలను మిశ్రమం చేసిన వారు ఇటు చేరలేరు, శాశ్వతంగా దాహార్తిని తీర్చుకోనూ లేరు’. నైతిక ధర్మాచరణకు, దాహార్తికి గల సంబంధం అసమానమైనది.
జకాత్‌ దానం కూడా నీటితో ముడివడి ఉంది. ఏ భూములైతే వర్షపునీరు లేక, సెలయేటి నీరూ లేక సాగుబడి అవుతాయో వాటి పంటలో పదో వంతును; ఏ భూములైతే నీటిపారుదల సమృద్ధిగా ఉండి సాగు అవుతాయో వాటి పంటలో ఇరవయ్యో వంతును జకాత్‌ దానంగా చెల్లించాలని ప్రవక్త (స.అ.వ) ఆదేశించారు. ఇది వ్యవసాయం చేసేవారి విధి. నీటి దానం గురించి ప్రవక్త (స.అ.వ.) ప్రస్తావించారు. ‘దారినపోయే ఒక వ్యక్తికి బాగా దాహం వేసింది. అటూ ఇటూ వెతికాడు. ఒక బావి కనిపించింది. అందులో దిగి నీళ్ళు తాగాడు. వెలుపలికి వచ్చిన తరవాత, ఒక కుక్కపిల్ల దప్పిక వల్ల నాలుక చాచి తడి మన్నును తినడం గమనించాడు. దాని దురవస్థకు జాలిపడి బావిలోకి దిగాడు. తన చర్మపు మేజోడులో నీళ్ళు నింపి, నోటితో పట్టుకొని వెలుపలికి వచ్చి, కుక్కపిల్లకు ఆ నీరు తాగించాడు. అల్లాహ్‌ ఆ వ్యక్తి చేసిన పనికి ప్రసన్నుడయ్యారు.కనుక ఏ ప్రాణిపట్ల దయచూపి దాహార్తి తీర్చినా పుణ్యం కలుగుతుంది’.
జీవనావసరమైన నీటిని, కూర్చొని రెండు లేక మూడు గుక్కల్లో తాగాలి. జమ్‌ జమ్‌ పవిత్ర జలాన్ని మాత్రం నిలబడి కాబా గృహం వైపు తిరిగి దుఆ చేసుకొని తాగాలి.
నీటిని పవిత్రంగా, అల్లాహ్‌ కరుణగా భావించాలి. ఉపవాస దీక్ష విరమణ చేసే విశ్వాసులందరూ దాహం తీర్చుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి. చక్కటి వర్షాల కోసం, పవిత్ర రమదాన్‌ మాసంలో అందరం ప్రార్థిద్దాం!
- షేక్‌ బషీరున్నీసా బేగం

No comments:

Post a Comment